తిరుమలలో ఘనంగా నారా దేవాన్ష్ జన్మదిన వేడుక
*శ్రీవారిని దర్శించుకున్న నారా కుటుంబం*
*అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షల విరాళం*
*భక్తులకు స్వయంగా అల్పాహారాన్ని వడ్డించిన కుటుంబ సభ్యులు*
తిరుమల: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి మనవడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కుమారుడు నారా దేవాన్ష్ జన్మదిన వేడుక తిరుమలలో ఘనంగా జరిగింది. నారా దేవాన్ష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబం శనివారం ఉదయం కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. సీఎం చంద్రబాబునాయుడు, భువనేశ్వరి దంపతులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, కుమారుడు నారా దేవాన్ష్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. శ్రీవారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్, కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద క్యూ కాంప్లెక్స్ లో భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. అన్నప్రసాద వితరణ కోసం ఒక్కరోజు వ్యయం అయ్యే మొత్తం రూ.44 లక్షలను శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు నారా కుటుంబం విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, నారా దేవాన్ష్ భక్తులకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. అనంతరం అందరూ కలిసి స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం.రవిచంద్రతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి