మరణానంతరం ఐదుగురికి ప్రాణభిక్ష పెట్టిన చిరంజీవి చైతన్య : ప్రత్తిపాటి
• కుమారుడి అవయవాలు దానం చేయాలన్న చైతన్య తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను : ప్రత్తిపాటి
• తమకొడుకును కోల్పోయిన బాధకంటే ఇతరుల ప్రాణాలు కాపాడమన్న ఆత్మసంతృప్తి చైతన్య తల్లిదండ్రుల్లో కనిపించింది :ప్రత్తిపాటి
• మానవత్వానికి ప్రతిరూపాలుగా నిలిచిన చైతన్య కుటుంబ సభ్యుల దయాహృదయానికి ప్రత్యేక కృతజ్ఞతలు : ప్రత్తిపాటి
మరణానంతరం ఐదుగురి ప్రాణాలు కాపాడుతున్న నల్లపనేని చైతన్య (26) చిరస్థాయిగా గుర్తుండిపోతాడని, అతని అవయవాలు మరో ఐదుగురికి ప్రాణభిక్ష పెట్టడం నిజంగా ఆ చిరంజీవికి దేవుడిచ్చిన గొప్ప వరమనే చెప్పాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
చిలకలూరిపేట పట్టణం.. 7వ వార్డుకు చెందిన నల్లపనేని వెంకటశివ, ఆదిలక్ష్మిల కుమారుడు నల్లపనేని చైతన్య గతనెల 27 న రోడ్డుప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ అయ్యి, గుంటూరులోని ఆస్టర్ రమేశ్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం మరణించాడు. మరణవార్త తెలిసిన వెంటనే మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి హుటాహుటిన గుంటూరు వెళ్లి, చైతన్య మృతదేహాన్ని పరిశీలించి, నివాళులు అర్పించారు. అనంతరం తల్లిదండ్రులు, కుటుంబసభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తమ కుమారుడి అవయవాలు దానం చేయాలన్న తల్లిదండ్రులు, తాతయ్య, ఇతర కుటుంబసభ్యుల నిర్ణయాన్ని ప్రత్తిపాటి మనస్ఫూర్తిగా స్వాగతించి, వారిని అభినందించారు.
*మరణానంతరం ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపిన అమరుడు చైతన్య*
చనిపోయిన తర్వాత కూడా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపి, వారి ప్రాణాలు కాపడే అరుదైన అవకాశాన్ని ఆ భగవంతుడు కోట్లలో ఒక్కరికే అందిస్తాడని, అలాంటి సదవకాశం పొందిన ఐదుగురికి ప్రాణభిక్ష పెట్టిన చైతన్య నిజంగా అమరుడేనని ప్రత్తిపాటి పేర్కొన్నారు. తమ కుమారుడిని కోల్పోయామన్న పుట్టెడు దుఖాన్ని అధిగమించి, ఇతరులకు ప్రాణదానం చేయాలన్న చైతన్య తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు త్యాగనిరతి, దయాహృదయాన్ని ఎంత పొగిడినా తక్కువే అవుతుందన్నారు. ఇతరుల ప్రాణాలు కాపాడామన్న ఆత్మసంతృప్తి చైతన్య తల్లిదండ్రుల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మానవత్వానికి ప్రతిరూపాలుగా నిలిచిన చైతన్య కుటుంబసభ్యులందరికీ పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్టు ప్రత్తిపాటి చెప్పారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి