హైదరాబాద్, జూన్ 10 (మల్లెల న్యూస్):
రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే వరకు ప్రభుత్వం విశ్రమించదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళా శక్తి పథకం కింద ఇప్పటికే ఆర్టీసీకి అప్పగించిన 553 బస్సులకు అదనంగా మరో 3 వేల బస్సులను మహిళా సంఘాల ద్వారా అద్దె ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు అప్పగిస్తామని ప్రకటించారు.
నిన్న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మహిళా వారోత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల యాజమాన్యంలోని 553 బస్సుల నిర్వహణను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు అప్పగిస్తూ బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల్లో 67 లక్షల మంది సభ్యులున్నారని, ఆ సంఖ్యను కోటి మందికి పెంచాలని పిలుపునిచ్చారు. “కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యత నాది” అని పేర్కొన్నారు. 2034 నాటికి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
మహిళా సంఘాలు స్థానికంగా వ్యాపార ప్రణాళికలు రూపొందించుకోవాలని, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో త్వరలో పర్యటిస్తానని సీఎం వెల్లడించారు. మహిళా శక్తికి ఈ ప్రభుత్వంలో ప్రత్యేక స్థానం ఉందని స్పష్టం చేశారు.
రైతులు లాభసాటి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని, వరి, మొక్కజొన్నలతో పాటు కందులు, మినుములు, పెసర్లు, కూరగాయలు, పండ్ల తోటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. పంటల మార్పిడి, రైతుల్లో అవగాహన కల్పించే బాధ్యతను మహిళా సంఘాలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు రూ.2,400 కోట్లతో అంతర్జాతీయ పండ్ల మార్కెట్ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.
ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరిటే మంజూరు చేస్తున్నామని, పట్టణాల్లో నిర్మించనున్న లక్ష ఇళ్లను కూడా మహిళల పేరుతోనే ఇస్తామని సీఎం ప్రకటించారు. మహిళల పర్యవేక్షణలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలవుతాయని పేర్కొన్నారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో ప్రభుత్వం ఇప్పటివరకు రూ.10 వేల కోట్లకు పైగా చెల్లించినట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలోని 27 వేల పాఠశాలల నిర్వహణ బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో మహిళలకు అప్పగించినట్లు చెప్పారు.
మహిళా శక్తి క్యాంటీన్లు, పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలను కూడా మహిళా సంఘాలకు అప్పగిస్తున్నామని తెలిపారు. జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి మహిళా సంఘాలు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 8 వేల స్త్రీశక్తి భవనాలను ప్రారంభించామని, భవిష్యత్తులో జిల్లా కేంద్రాల్లో కార్పొరేట్ స్థాయిలో మహిళా శక్తి భవనాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
స్వయం సహాయక సంఘాలకు రూ.61 వేల కోట్ల బ్యాంకు అనుసంధానం కల్పించడంతో పాటు సున్నా వడ్డీ రుణాల కోసం రూ.2 వేల కోట్లు బ్యాంకులకు చెల్లించినట్లు సీఎం వెల్లడించారు. ఈ సందర్భంగా మహిళా శక్తి, మహాలక్ష్మి పథకాల కింద స్వయం సహాయక సమాఖ్యలు, మండల మహిళా సమాఖ్యలకు చెక్కులను అందజేశారు. ఆర్టీసీకి అప్పగించిన బస్సులపై అద్దె రూపంలో రూ.20.34 కోట్ల చెక్కు, మహిళల ఉచిత ప్రయాణం కింద ఆదా చేసిన రూ.10,700 కోట్లు, వడ్డీ లేని రుణ పథకం కింద రూ.500 కోట్ల చెక్కులను అందించారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి