ఇకనుంచి ఒకటవ తరగతి నుంచే బేసిక్ మిలిటరీ శిక్షణ !
మహారాష్ట్ర ప్రభుత్వం ఇకనుంచి 1వ తరగతి నుంచే విద్యార్థులకు బేసిక్ మిలటరీ శిక్షణ ఇవ్వనుంది.
విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక వ్యాయామం వంటి లక్షణాలు పెంపొందించేదుకు బేసిక్ మిలిటరీ శిక్షణ ఇస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదా భూసే తెలిపారు.
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి తమ రాష్ట్రంలో ఒకటవ తరగతి నుంచే విద్యార్థులకు బేసిక్ మిలటరీ శిక్షణ ఇవ్వనుంది. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక వ్యాయామం వంటి లక్షణాలు పెంపొందించేదుకు బేసిక్ మిలిటరీ శిక్షణ ఇస్తామని మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదా భూసే తెలిపారు. ఇలా చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే దానిపై వాళ్లకు అవగాహన ఉంటుందని చెప్పారు. ఇందుకోసం విద్యార్థులకు మాజీ సైనికులతో కలసి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్లలోని విద్యార్థులకు మాజీ సైనికులు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. తాము చేసిన ఈ ప్రతిపాదనకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సానుకూలంగా స్పందించారని.. దీన్ని అమలు చేసేందుకు క్రీడా ఉపాధ్యాయులు, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)తో సహా 2.5 లక్షల మంది రిటైర్డ్ సైనికుల సాయం తీసుకుంటామని దాదా భూసే తెలిపారు. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, ఆ తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ జరగిన క్రమంలో ఈ ప్రతిపాదన తీసుకొచ్చామని విద్యాశాఖ మంత్రి దాదా భూసే వివరించారు.
ఇదిలాఉండగా ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఉన్న బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి 9 పాక్ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. మరోవైపు ఉగ్రదాడులు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, వరదలు వంటివి వచ్చినప్పుడు ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలో అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో మాక్డ్రిల్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి