YSRCP: చంద్రబాబు భవిష్యత్ భయంకరంగా ఉంటుంది- వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ప్రశ్నించే వారందర్నీ జైల్లో పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని సజ్జల రామకృష్ణరెడ్డి కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని సజ్జల ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. రాజకీయ పగతోనే నేతలపై వరుస పెట్టి కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా కల్పిత కథనాలతో అలాంటి కేసే కాకాణిపై పెట్టారని మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించినంత మాత్రాన ఎవరూ భయపడిపోరని సజ్జల చెప్పుకొచ్చారు. జైలుకు వెళ్లిన వాళ్లంతా మరింత రాటుతేలుతారని చెప్పుకొచ్చారు.
వైఎస్సార్సీపీలో ఉండే సీనియర్ నేతలను టార్గెట్ చేస్తారని తమకు ముందే తెలుసుఅన్నారు సజ్జల. తాము కూడా అన్నింటికీ సిద్ధంగానే ఉన్నామని జైలుకు వెళ్లడానికి రెడీ అన్నారు. ఇలా వ్యవస్థలను మేనేజ్ చేసి సిస్టమ్ను తప్పుదారి పట్టించి చేపట్టే ప్రక్రియ బాగాలేదన్నారు. అరెస్టు అనేది అల్టిమేట్ అని అన్నారు సజ్జల. కానీ అరెస్టు చేసిన తర్వాత కేసును పుటప్ చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు చేస్తున్న చర్యలు తిరిగి ఆయన మెడకు చుట్టుకుంటాయని హెచ్చరించారు సజ్జల. కచ్చితంగా దీనికి ఫలితం భయంకరంగా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఒకసారి సిస్టమ్ దారి తప్పితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ చట్టాన్ని ఎవరూ చేతులోకి తీసుకోలేదని అన్నారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు అందర్నీ సాక్ష్యాలతోనే అరెస్టు చేశామని గుర్తు చేశారు. ఇలా చేయాలనుకుంటే గెలిచిన మూడు నెలలకే చంద్రబాబును జైల్లో పెట్టే వాళ్లమని వ్యాఖ్యానించారు.
మొదటి నుంచి చెబుతున్నట్టు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు సజ్జల. తమకు సపోర్ట్ చేసే మీడియాలో కథనాలు రాయించడం, తర్వాత వాటి ఆధారంగా కేసులు పెట్టి ఎవరితోనో చెప్పించి కీలక నేతలను అరెస్టు చేస్తున్నారని అన్నారు. పబ్లిక్గానే పోలీసులు ప్రజలను కొడుతున్నారని తెలిపారు. సామాన్యులు భయపడిపోతున్నారని వివరించారు.
చంద్రబాబు తన రాజకీయ ఉనికి లేకుండా చేసుకుంటున్నారని అన్నారు సజ్జల. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇంత వ్యతిరేకత ఏ ప్రభుత్వంపై చూడలేదని అన్నారు. అందుకే ఈ ప్రభుత్వానికి పాడె కట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని పేర్కొన్నారు
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి