వ్యాపారవేత్తలుగా కుల వృత్తుదారులు
* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
* ఆదరణ-3 కింద అధునాత పరికరాల అందజేత
* కుట్టు శిక్షణతో మహిళలకు ఆర్థిక భరోసా
* శిక్షణా కేంద్రాలను తరుచూ సందర్శించండి
* ఈడీలకు మంత్రి సవిత ఆదేశం
అమరావతి : కుల వృత్తుదారులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, దీనిలో భాగంగా మూడో విడత ఆదరణ పథకం కింద అధునాతన పరికరాలు అందివ్వనున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్, చేనేత మరియు జౌళి సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వివిధ జిల్లాలకు ఈడీలతో మంత్రి మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అందిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ గురించి జిల్లాల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి సవిత మాట్లాడుతూ, మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత టైలరింగ్ శిక్షణతో కుట్టు మిషన్లు అందజేస్తోందన్నారు. కుట్టు శిక్షణకు హాజరవుతున్న మహిళలను పథకంపై సంతృప్తి వ్యక్తం చేస్తుండడంపై మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. కుట్టు శిక్షణా కేంద్రాలను తరుచూ సందర్శించాలని ఈడీలకు మంత్రి సవిత ఆదేశించారు. లబ్ధిదారుల హాజరు వంద శాతం ఉండేలా చూడాలని, పకడ్బందీగా ఎఫ్.ఆర్.సి చేయించాలని స్పష్టంచేశారు. మహిళలకు అత్యుత్తమ శిక్షణ అందివ్వడంతో పాటు వారు తయారు చేసే వస్త్రాలకు మార్కెట్ సదుపాయం కూడా కల్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత ఆదేశించారు.
అధునాతన ‘ఆదరణ’ పరికరాలు
మూడో విడత ఆదరణ పథకం కింద కుల వృత్తుదారులకు సంప్రదాయ పరికరాలకు బదులు అధునాతన పరికరాలు అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి సవిత తెలిపారు. కుల వృత్తుదారులను వ్యాపారులుగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ఆదరణ-3 అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రాంతాల వారీగా లబ్ధిదారులు ఎటువంటి పరికరాలు ఆశిస్తున్నారో వివరాలు సేకరించాలన్నారు. ఆ వివరాలను రాష్ట్ర బీసీ కార్పొరేషన్ అధికారులకు ఎప్పటికప్పుడు అందజేయాలన్నారు. కుల వృత్తుదారులకు సద్వినియోగమయ్యేలా ఆదరణ-3 అమలు చేయబోతున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, ఉమ్మడి జిల్లాలకు ఈడీలు, బీసీ కార్పొరేషన్ అధికారులు హాజరయ్యారు
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి