అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం
హైదరాబాద్ న్యూస్ డెస్క్ ; వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. వర్షాకాలం సన్నద్ధతపై అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. మాన్సూన్ అత్యవసర బృందాలు 24 గంటలకు అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం చెప్పారు. హైదరాబాద్లో నీళ్లు నిలిచే 141 ప్రాంతాల్లో నిర్మిస్తున్న వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పనుల పురోగతిని సీఎం తెలుసుకున్నారు. హార్వెస్టింగ్ వెల్స్లోకి చేరే వర్షపు నీటిని ఆటోమెటిక్ పంపులతో బయటకు పంపించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు.
వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. వర్షాలు, వరదల ప్రభావాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సీఎం తెలిపారు. హైదరాబాద్లో ట్రాఫిక్, ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాలు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న నాలాల పూడికతీత పనులు వీలైనంతగా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు.
అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్లో సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం తెలిపారు. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని చెరువులు, నాలాల సంరక్షణ, రోడ్ల విస్తరణ, అభివృద్ధి కోసం సంబంధించి ప్రత్యేక పాలసీని తయారు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు ముఖ్యమంత్రి తెలిపారు. సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, సీఎంఓ అధికారులు శేషాద్రి, మాణిక్ రాజ్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, హెచ్ఎండీఏ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి