దిల్లీ: మరో ప్రేమికుడి హత్య... కులం తక్కువని కొట్టి చంపారు -
అయిదుగురు వ్యక్తులు ఆ యువకుడిని పక్కకు లాగి దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి. అమ్మాయి తరఫు బంధువులు ఆ ప్రేమికుడిని కులం వేరనే కారణంతో దాడి చేసి చంపేశారు.
ఒక యువతితో స్నేహం చేసినందుకు దిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని ఆమె బంధువులు కొట్టి చంపారు. ఈ నెల 7న దిల్లీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం పశ్చిమ దిల్లీ ఆదర్శనగర్లో ఉంటున్న 18 ఏళ్ల వయసున్న రాహుల్ రాజ్పుత్ ఢిల్లీ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడని కథనంలో చెప్పారు.
కుటుంబాన్ని పోషించడానికి చాలా మందికి ట్యూషన్లు చెబుతూ ఉండేవాడు. అదే ప్రాంతానికి చెందిన ఒక అమ్మాయితో స్నేహం బాగా బలపడింది.
ఇద్దరి కులాలు వేరు కావడంతో వారి స్నేహం నచ్చక అమ్మాయి తరఫు బంధువులు రాహుల్పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత రాహుల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు నార్త్వెస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ఆర్య చెప్పారని సాక్షి రాసింది.
అయిదుగురు వ్యక్తులు రాహుల్ని తోస్తూ పక్కకి లాగడం, అతనిపై దాడికి దిగిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయని తెలిపింది.
ఈ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ అమ్మాయి సోదరుడు, మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి కుటుంబానికి దిల్లీ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసింది.
పల్లెటూరు నుంచి వచ్చిన ఆ కుటుంబాన్ని రాహుల్ పోషిస్తున్నాడని, అందరికీ సాయపడుతూ ఉండే అతని మృతి ఆ కుటుంబానికి తీరని లోటని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారని సాక్షి వివరించింది.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి