విజయదశమి రోజున శమీ వృక్ష పూజ, పాల పిట్ట దర్శనం
శ్లో|| శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ ||
దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని తెలియచేయబడింది. 'శ్రవణా' నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి "విజయ"అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయ దశమి' అను పేరు వచ్చినది. ఏ పనైనా తిధి , వారము తారా బలము , గ్రహాబలము ముహూర్తము మున్నగునవి విచారించకుండా , విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము. 'చతుర్వర్గ చింతామణి' అనే ఉద్గ్రందము ఆశ్వయుజ శుక్లదశమి నాటినక్షత్రోదయ వేలనే 'విజయం ' అని తెలిపి యున్నది. ఈ పవిత్ర సమయము సకలవాంచితార్ద సాధకమైనదని గురు వాక్యము.
*'శమీ పూజ'* చేసుకునే ఈ రోజు మరింత ముఖ్యమైనది. శమీ వృక్షమంటే 'జమ్మి చెట్టు'. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారి వారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి ఉంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి , తిరిగి ఆయుదములను , వస్త్రములను పొంది , శమీవృక్ష రూపమున ఉన్న *'అపరాజిత'* దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు .
విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మి చెట్టు) వద్ద గల అపరాజితా దేవిని పూజించి , పై శ్లోకం పఠిస్తూచెట్టుకు ప్రదక్షణలు చేయాలి. పై శ్లోకము వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలించాలి. ఇలా చేయుట వల్ల అమ్మవారి కృపతోపాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.
*‘‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ , అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ. శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా , ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ. కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా , తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే.''
పాలపిట్ట దర్శనం ఎందుకు?
పాండవులు అరణ్య, అజ్ఞాత వాసాలను ముగించాక విజయదశమి రోజు శమీ వృక్షంపై ( జమ్మి చెట్టు) ఉన్న తమ ఆయుధాలను తీసుకుని హస్తినాపురం వైపు ప్రయాణానికి ఉద్యుక్తులు కాగా ఆ సమయంలో వారు ఎదురుగా వచ్చిన పాలపిట్టను చూస్తారు. అప్పటి నుండి పాండవులకు అన్నీ శుభాలే కలుగుతాయి. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై వారు విజయం సాధిస్తారు. అప్పటి నుండి దసరా రోజున ( విజయదశమి రోజున) పాలపిట్టను చూడడం ఆనవాయితీగా వస్తోందని పురాణాలు చెబుతున్నాయి.
ఓం దుం దుర్గాయై నమః
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి